ట్విస్ట్: గంతలు కట్టి రాత్రంతా తిప్పారని..కోర్టుకు వీరశివా
తనను రాత్రంతా ఓ వాహనంలో తిప్పి ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులో వదిలేశారని ఆయన కలెక్టర్కు చెప్పారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతంలో వదిలి పెట్టినందువల్లే తాను అందుబాటులో లేనని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు ఒకరోజు డిసిసిబి ఎన్నికలు వాయిదా పడగా.. కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి వాటిని మరికొన్నిరోజులు వాయిదా వేయించేందుకు హుటాహుటిన కడప నుండి హైదరాబాదుకు బయలుదేరారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని, దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఇప్పటికే ఆరోపించారు. డిసిసిబి ఎన్నికల్లో జగన్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే కాంగ్రెసు నేతలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లారు. వీరశివా రెడ్డి ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు కడప నుండి హైదరాబాదుకు బయలుదేరారు.
కడప జిల్లా డిసిసిబి ఎన్నిక రేపటికి వాయిదా పడటంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డిసిసిబి ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నిన్నటి నుండి అదృశ్యం కావడం, ఈ రోజు చిత్తూరు జిల్లాలో దొరకడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు.