మహిళా టెక్కీ కిడ్నాప్ కలకలం: ఆటోలో నుండి దూకి..
ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఇది జరిగింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల యువతి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. హిమయత్నగర్లోని మిత్రురాలితో కలిసి అమీర్పేటలో ఓ సాఫ్టువేర్ కంపెనీలో ప్రాజెక్టు వర్క్ చేస్తున్నారు. మంగళవారం విధులు ముగించుకొని ఆమె మైత్రీ వనమ్ చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి చూస్తోంది.
ఇంతలో ఓ ఆటో వచ్చి ఆమె ముందు ఆగింది. అందులో నుంచి దిగిన ఇద్దరు ఆగంతుకులు బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించుకొని పారిపోయారు. స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న సంజీవరెడ్డినగర్ పోలీసులు అన్ని స్టేషన్లకు సమాచారం పంపించారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలో మొదలు పెట్టారు. ఆగంతుకుల ఆటో గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ వద్దకు చేరుకున్నాక యువతి ధైర్యం ప్రదర్శించి వాహనంలో నుంచి కిందకు దూకింది.
ఆమెను తిరిగి పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. ఇంతలో విషయాన్ని మిగతా ఆటో వారు గమనించడంతో పారిపోయారు. కిందపడటంతో గాయపడ్డ ఆమెను స్థానికులు మాదాపూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి తప్పించుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కిడ్నాపర్లు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నట్టు సంజీవరెడ్డినగర్ పోలీసులు తెలిపారు. రాత్రి తొమ్మిదింపావు గటంల సమయంలో ఆమె వాహనంలో నుండి కిందకు దూకింది. కింద దూకడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తమను కొందరు వెంబడిస్తున్నారని తెలుసుకున్న ఆటోలోని ముగ్గురు నిందితులు ఆమెను కిందకు తోసేసినట్లుగా కూడా చెబుతున్నారు.