దాడి కేసులో కోర్టులో టిడిపి ఎమ్మెల్యే లొంగుబాటు
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఎస్ఐ మోహన్ రావు పైన దాడి కేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చింతమనేని పైన 341, 332, 506, రెడ్విత్ 34 సెక్షన్ల కింద ఎమ్మెల్యేతో పాటు ఆయన గన్మెన్ల పైన కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఆయన లొంగిపోయారు.
చింతమనేని ప్రభాకర్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గత నెల ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. చింతమనేని కోసం అప్పుడు ఆరు పోలీసుల బృందాలు రంగంలోకి దిగినట్లుగా వార్తలొచ్చాయి.
పెదవేగి ఎస్సై బండి మోహన రావు సిబ్బందితో పినకడిమి గ్రామానికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని తీసుకు వెళ్తుండగా ఎమ్మెల్యే తన కారుతో తమను అడ్డగించారని, తనను చంపుతానంటూ బెదిరిస్తూ కొట్టారని ఎస్సై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గన్మన్, అనుచరులు శాసనసభ్యుడికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.