కడప ఉద్రిక్తం: వీరశివాపై జగన్ పార్టీ చెప్పులు, ఫిర్యాదు
చంద్రశేఖర్ రాత్రి నుంచి కనిపించడం లేదు. తన భర్త అదృశ్యమయ్యారని ఎన్నికల అధికారి సతీమణి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారి అదృశ్యంతో ఎన్నికలు వాయిదా పడతాయేమోననే ఆందోళనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భారీగా డిసిసిబి కార్యాలయానికి చేరుకున్నారు. అధికారి అదృశ్యం, కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వీరశివా రెడ్డి కూడా అక్కడకు తన అనుచరులతో చేరుకున్నారు. ఈ సమయంలో జగన్ పార్టీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పైన చెప్పులు విసిరారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. తనపై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని వీరశివా రెడ్డి వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు అధికారి అదృశ్యం నేపథ్యంలో కలెక్టర్ చర్యలు చేపట్టారు. డిసిఎంఎస్ ఎన్నికల నిర్వహణాధికారి రమేష్కు డిసిసిబి ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అప్రమత్తం చేశారు. కాగా, కడప కలెక్టర్ నుంచి నివేదిక రాగానే చర్యలు చేపడతామని సహకార శాఖ అధికారులు అధికారి అదృశ్యంపై అన్నారు. కిడ్నాప్ విచారణపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. కాగా, డిసిసిబి ఎన్నికను వాయిదా వేయించేందుకే అధికారిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అదృశ్యమైన అధికారి చంద్రశేఖర్ను పోలీసులు చిత్తూరు జిల్లాలో గుర్తించినట్లుగా తెలుస్తోంది.