ఊరట: వీరప్పన్ అనుచరుల ఉరిశిక్షపై స్టే పొడిగింపు
వీరప్పన్ అనుచరుల ఉరి శిక్షపై బుధవారం ఉదయం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఉరితీతను మరోసారి వాయిదా వేసింది. ఉరిపై స్టేను ఆరు వారాలపాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరప్పన్ అనుచరుల ఉరి శిక్ష అమలుపై సుప్రీం కోర్టు ఈ నెల 18వ తేదిన విచారణ జరిపి తాత్కాలిక స్టే ఇచ్చి, తదుపరి విచారణ బుధవారం నాటికి వాయిదా వేసింది.
ఉరి శిక్షపై మరొక బెంచ్ విచారణ జరుపుతోందని, ఆ బెంచ్ తీర్పు వచ్చే వరకూ ఎదురు చూద్దామని సుప్రీం బెంచ్ తెలిపింది. వీరప్పన్ అనుచరులు జ్ఞానప్రకాశ్, సైమన్, మీ సేకర్ మాదయ్య, బిలవెంద్రన్లు కర్నాటకలోని పాలర్ ప్రాంతంలో మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్న కేసులో వారికి మరణశిక్ష అమలు చేయాలని 2004లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
మొదట ఈ ఘటనలో మైసూర్ కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. అనంతరం సుప్రీం కోర్టు వీరి జీవిత ఖైదును ఉరిశిక్షగా మార్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 13వ తేదిన తిరస్కరించారు. దీంతో వారు ఉరి శిక్షపై సుప్రీం కోర్టుకు వెళ్లారు.