హాలీవుడ్ను తలపించేలా నిమిషాల్లో 300 కోట్లు చోరీ
సెక్యూరిటీ సిబ్బంది విమానాశ్రయంలో వజ్రాల పెట్టెలు పెడుతుండగా రన్వే పైకి రెండు వాహనాలు దూసుకొస్తూ కనిపించాయి. అందులో ఒకటి మెర్సిడెస్ వ్యాను, రెండోది పోలీసు వాహనాన్ని తలపించేలా నీలిరంగు బల్బులు వెలుగుతున్న ఆడి సెలూన్ కారు. వాళ్లంతా ఆ షాక్లోంచి బయటపడేలోగానే ఆ రెండు వాహనాలూ అక్కడికొచ్చి ఆగాయి. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు వాటిలోంచి దిగారు.
వారి చేతుల్లో అధునాతన మారణాయుధాలున్నాయి. చీకట్లో సైతం గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల లేజర్ సౌకర్యం ఉన్న ఆటోమేటిక్ ఆయుధాలు వారి వద్ద ఉన్నాయి. ఆ తుపాకులను వారు విమానాశ్రయ సిబ్బందికి గురి పెట్టారు. కదిలితే కాల్చిపారేస్తామని హెచ్చరించారు. విమానంలోకి లోడ్ చేస్తున్న రెండు వజ్రాల పెట్టెలను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. కన్నుమూసి తెరిచేలోగా వచ్చిన దారిలో అక్కణ్నుంచి పరారయ్యారు.
వారు దోచుకున్న వజ్రాల విలువ దాదాపుగా 300 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ వజ్రాలు ఆంట్వెర్ప్ నుంచి జ్యూరిచ్కు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ముందుగా పసిగట్టిన నేరగాళ్లు పకడ్బందీ వ్యూహంతో పక్కా ప్రణాళికతో నిమిషాల వ్యవధిలో కొల్లగొట్టారు. వారు ఈ దోపిడీని మూడు నిమిషాల్లోనే చేశారు. గన్నులతో భయపెట్టి వారు తమ పనిని ముగించుకు వెళ్లారు. నేరస్తులను పట్టుకునేందుకు బెల్జియం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విమానాశ్రయానికి సమీపంలో కాలిపోయిన స్థితిలో ఉన్న మెర్సిడెస్ వ్యాన్ పోలీసులకు కనిపించింది. ఇది భారీ దోపిడీ అని ఆంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్కు చెందిన కారోలిన్ డి వోల్ఫ్ అన్నారు. ఈ దోపిడీకి పాల్పడినవారు రన్వేకి ఉన్న కంచెకు రంధ్రం చేశారని దాంట్లోంచే రన్వేపైకి ప్రవేశించి, తిరిగి అదే మార్గం గుండా బయటికి తప్పించుకున్నారని విమానాశ్రయానికి చెందిన ప్రతినిధి జాన్ వాన్ డెర్ క్రూసే తెలిపారు. తాము అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ ఎలా జరిగిందో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ఆంట్వెర్స్ డైమండ్ సెంటర్ వద్ద ఇంచుమించు రూ.536 కోట్ల విలువైన వజ్రాలను దోచకెళ్లారు.