శత్రువుల మాటల్నితిప్పికొడదాం, కుందేళ్లులేవు: కెటిఆర్
సడక్ బందును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రతిధ్వనించేలా సడక్ బందు జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణను చేర్చకపోవడంతో కాంగ్రెసు పార్టీ నయవంచక పార్టీ అని మరోసారి రుజువు అయిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణవాదం లేకపోవడం దారుణమన్నారు. సడక్ బందును నిర్వీర్యం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు.
తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేళ్లు తెలంగాణలో లేవన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ సత్తాను చాటేలా సడక్ బందును విజయవంతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేసిందే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఐకాస తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేస్తోందని, తెరాస అందులో క్రియాశీలకంగా ఉందన్నారు.
తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోకపోవడం శోచనీయం అన్నారు. అనివార్యంగా జరిగే 2014 ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించాలన్నారు. వంద అసెంబ్లీ, 16 పార్లమెంటు సీట్ల ద్వారా తెలంగాణ ఆకాంక్ష తెలియచెప్పాల్సిన అవసరముందన్నారు. కొంతమంది శత్రువులు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణవాదం లేరని అంటున్నారని, సడక్ బందు ద్వారా, వచ్చే ఎన్నికల ద్వారా వారికి గుణపాఠం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు అందరు సడక్ బందులో పాల్గొంటారన్నారు.