కళ్లలో కారం కొట్టి ఆటోలో నుండి దూకిన మహిళా టెక్కీ
ఈ వివరాలను సైబరాబాద్ కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమల రావు బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రలోని సింధూదేర్గా జిల్లా వెందుల గ్రామానికి చెందిన నిఖిల గోవాలోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగ నిమిత్తం ఆమె ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చారు. అమీర్పేట ఆదిత్య ట్రేడ్ సెంటర్ ఐదో అంతస్థులోని థామస్ అండ్ బెట్ ఇండియా లిమిటెడ్లో వెబ్ డిజైనర్గా పనిచేస్తున్నారు.
నారాయణగూడలోని స్నేహితురాలు లీనతో కలిసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకున్న నిఖిల్ మాదాపూర్లోని లోరల్ బ్యూటీ పార్లల్కు వచ్చారు. తర్వాత అమీర్పేట్ వెళ్లి అక్కడి నుంచి నారాయణగూడ వెళ్లాలనుకున్నారు. ఆమె ప్రధాన రహదారికి పక్కనే గల గ్రీన్బావర్చీ వద్ద నిలబడి ఉండగా వచ్చిన షేరింగ్ ఆటో ఎక్కారు. కంట్రోల్ రూం నుంచే అందిన సమాచారం నిఖిల తెలిపిన సమాచారాన్ని లినా హైదరాబాద్ కంట్రోల్ రూంకు చేర వేశారు.
వారు ఉత్తర మండలంలోని మహిళా పోలీసులను అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి విషయం సైబరాబాద్ పోలీసులకు చేరింది. దీంతో క్యూఆర్టీ బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని ప్రాంతాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరో పక్క మాదాపూర్ నుంచి నమోదైన సిసి కెమెరాల ఫుటేజిని కమిషనరేట్లోని కంట్రోల్ రూంలో పరిశీలించారు. ఆటో నంబరు సరిగ్గా కనిపించడం లేదని ముందుగా చెప్పిన పోలీసులు దాని ఆధారంగానే సగం పురోగతి సాధించారని తెలుస్తోంది.
గచ్చిబౌలిలోని ఐటి జోన్లో అనుమానాస్పదంగా ఆటో తిరుగుతుండగా నిందితులను అరెస్టు చేశామని కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. నిఖిల అపస్మారక స్థితిలో ఉన్నారని, మాట్లాడలేకపోతున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారని మాత్రమే పేర్కొన్నారని కమిషనర్ చెప్పారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ఇతర కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామన్నామని ఆయన చెప్పారు.
కాగా, మంగళవారం ఆటో డ్రైవర్ జంగయ్యకు బితిన్ పైలట్గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరు ఆ రోజు బాగా తాగి ఉన్నారు. తర్వాత ప్రయాణీకులను ఎక్కించుకున్నారు. అందరూ మధ్యలో దిగారు. నిఖిల మాత్రం ఆటోలో ఉంది. దీంతో వారు రూటు మార్చారు. ఎక్కడికి వెళ్తున్నామని బాధితురాలు ప్రశ్నిస్తే.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని నిఖిల్ తన స్నేహితురాలు లినాకు మెసేజ్ చేశారు.
కాసేపటికి మరో స్నేహితుడు కిరణ్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే బితిన్ ఆమె నుంచి ఫోన్ లాక్కుని స్విచ్ఛాఫ్ చేశాడు. సరిగ్గా ఐఎస్బి వద్దకు వెళ్లే సరికి నిఖిల్ తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేను వారి కళ్లలో కొట్టి ఆటోలోంచి దూకేశారు. అక్కడే ఉన్న విప్రో ఉద్యోగి నవీన్తోపాటు కొంతమంది గాయాలతో ఉన్న ఆమెను మాదాపూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అమీర్పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఉన్నత చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి మార్చారు.