మక్కా పేలుళ్లలో, ఇప్పుడూ: అబ్దుల్పై పోలీసుల ఆరా
అబ్దుల్ వాసిఫ్ మీర్జా 2007 మక్కా మసీదు పేలుళ్లలో గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గురువారం జరిగిన పేలుళ్లలో స్వల్పంగా గాయపడ్డాడు. ఒక వ్యక్తి రెండు పేలుళ్లలు జరిగిన చోటు ఉండడంపై పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. 2007 తర్వాత అబ్దుల్ ఏం చేశాడనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే, అబ్దుల్ వ్యక్తిగత వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఒక వ్యక్తి గాయపడడం వల్ల అనుమానాలు రావడం సహజమని, ప్రాథమిక విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.
అబ్దుల్ హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్లో దుకాణం నడుపుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే, చాయ్ తాగడానికి గురువారం సాయంత్రం దిల్షుక్నగర్ వచ్చినట్లు అబ్దుల్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో అతనిపై పోలీసులకు అనుమానాలు మరింతగా పెరిగాయని అంటున్నారు. పేలుళ్ల ఘటనలో గాయపడినవారి వివరాలను పోలీసులకు గురువారం రాత్రి 11 గంటలకు గానీ సేకరించలేకపోయారు. క్షతగాత్రుల వివరాలు సేకరించే సమయంలో అబ్దుల్ వాసిఫ్ మీర్జా విషయం తెలిసింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అబ్దుల్ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
దిల్షుక్నగర్లోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద ఓ మారుతి కారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిచి ఉండడంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో చెప్పారు. సిసి టీవి కెమెరాలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.
కాగా, బాంబు పేలుళ్లకు నిరసనగా బిజెపి శుక్రవారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాపబాదులో చాలా వరకు దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెలంగాణ సాధన కోసం ఈ నెల 24వ తేదీన తెలంగాణ జెఎసి తలపెట్టిన సడక్ బంద్ వాయిదా పడింది.