దిల్సుఖ్ నగర్ పేలుళ్లు: అరగంటలోనే పూర్తి చేశారు!
నిందితులు సైకిళ్లను ఎలా సమకూర్చుకున్నారు? ఎక్కడ మకాం వేశారు? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. సిసి కెమెరాల్లో నిందితులు, అనుమానితులు, సానుభూతిపరుల కదలికల్ని సమీక్షిస్తున్నారు. పేలుడుకు కొద్ది రోజుల ముందు, ఆ తర్వాత హైదరాబాదు నగరం నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వంటి వాటిని పరిశీలించడం, బస్టాండులు, రైల్వే స్టేషన్లోని సిసి కెమెరాలను పరిశీలించడం చేస్తున్నారు.
ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు ఎలాంటి ఆధారాలు దొరకనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పేలుళ్లకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. దీంతో, ఏ అంశాన్ని వదిలి పెట్టకుండా దర్యాఫ్తు చేస్తున్నారు. పేలుడు కోసం వాడిన డిటోనేటర్ ఎక్కడిదో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పేలుళ్లకు సైకిల్ వినియోగించినందున సైకిళ్లు అమ్మిన వారు లేదా పోగొట్టుకున్న వారు తమ సమాచారం అందించాలని పోలీసులు నగర వాసులను కోరారు.
గురువారం రోజు ఉగ్రవాదాలు అరగంటలోపే పేలుళ్ల పని పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు. సమీపంలో బస చేసిన ఉగ్రవాదులు కోణార్క్, వెంకటాద్రి థియేటర్లలో రెండు నిమిషాల వ్యవధిలో పేలుళ్లు జరిపారు. సైకిళ్లు తీసుకు వచ్చి పేలుళ్లు జరపడం ఇదంతా కేవలం అరగంటలోనే పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు.