జగన్ హామీ ఇచ్చారు, వెళ్తున్నాననే దాడులు: గొట్టిపాటి
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు. అద్దంకి టిక్కెట్ పైన తనకు జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. తాను జగన్ వైపు వెళ్తున్నాననే ఉద్దేశ్యంతోనే అధికార కాంగ్రెసు పార్టీ తన క్వారీల పైన దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్ను అన్యాయంగా, కుట్రపూరితంగా అవినీతి కేసులో ఇరికించి జైలులో పెట్టించారని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు.
గొట్టిపాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం గత కొద్దికాలంగా జరుగుతోంది. ఈ రోజు అతను జగన్ను కలిసి చెప్పడంతో ప్రచారానికి తెరపడినట్లే. జగన్ను కలిసిన గొట్టిపాటి రవి కుమార్.. పార్టీలో చేరే అంశంపై, ఎప్పుడు చేరాలనే విషయంపై మాట్లాడినట్లుగా సమాచారం. ఇతను త్వరలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు రక్తదాన శిబిరం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని లయన్స్ కల్యాణ మండపంలో బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగా రావు ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 50 మంది వరకు యువకులు రక్తదానం చేశారు.