తీవ్ర అస్వస్థత: అపోలో ఆస్పత్రిలో చేరిన అక్బరుద్దీన్
నిజామాబాద్ నుంచి వస్తుండగా మూత్రాశయనాళం వద్ద, కడుపులో నొప్పిగా ఉందని అక్బరుద్దీన్ ఫిర్యాదు చేశారు. దీంతో అపోలో ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. ముగ్గురు వైద్యులతో కూడిన వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇసిజితో పాటు ఇతర పరీక్షలు కూడా వైద్యులు నిర్వహిస్తున్నారు.
నిర్మల్లో ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన సమయంలో కూడా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై ఆయన చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను హైదరాబాదు నుంచి నిర్మల్ కోర్టుకు తరలించి, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా జైలుకు తీసుకుని వెళ్లారు. ఆయన పదికి పైగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అప్పుడే వైద్యులు గుర్తించారు.
హైదరాబాద్ పాతబస్తీలో పర్యటన సందర్భంగా గతంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తొడలనూ కడుపులోనూ ఇంకా బుల్లెట్లు ఉన్నాయి. దీంతో ఆయనకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. మంగళవారంనాడు నిజామాబాద్ కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా కామారెడ్డి వద్ద అక్బరుద్దీన్కు నొప్పి రావడం ప్రారంభమైంది. అక్కడి నుంచి నేరుగా అపోలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.