రైల్వేబడ్జెట్: నెత్తిపై తెల్లగుడ్డ, ఎవరేమన్నారు?(పిక్చర్స్)
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవర్ కుమార్ బన్సల్ ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్రానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి కేంద్రంలో పదిమంది కేంద్రమంత్రులు, ముప్పై మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ సరైన న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రతి ఏటా అన్యాయమే జరుగుతోందని ఆయా పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇలా అన్ని పార్టీలు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈసారి కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉండటంతో రాష్ట్రానికి ప్రాధాన్యత ఉంటుందని గట్టిగా ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి నెరవేరలేదంటున్నారు. అయితే, గతంలో కంటే కొంత మెరుగు అనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి. కానీ, సరైన ప్రాధాన్యం మాత్రం లభించలేదంటున్నారు.
రైల్వే బడ్జెట్ పైన జాతీయస్థాయి నేతలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది రైల్వే బడ్జెట్ కాదని రాయ్బరేలీ బడ్జెట్ అని బిజెపి సీనియర్ నేత గోపీనాథ్ ముండే అన్నారు. బడ్జెట్ పూర్తిగా కాంగ్రెసు పక్షంగా ఉందని, కొన్ని రాష్ట్రాల ప్రయోజనాలను ఈ బడ్జెట్ పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు.
బన్సల్ బడ్జెట్ అమెథీ-రాయ్బరేలీ బడ్జెట్గా ఉందని చిత్తూరు ఎంపి శివప్రసాద్ ఎద్దేవా చేశారు. బడ్జెట్కు నిరసనగా అతను నెత్తిమీద తెల్లగుడ్డ వేసుకొని, చెక్క భజన చేశారు. బడ్జెట్లో సౌకర్యాలను గాలికి వదిలేశారని, బన్సల్ హరికథ చెప్పారని విమర్శించారు. తిరుపతి-షిర్డి మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కోట్ల స్పందించి సప్లమెంటరీ బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీస్ సాల్ కే బాద్ బన్సల్ ఆగయా ఖతం కర్ దియా అని విమర్సించారు. అడిగినవి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. నెత్తిమీద తెల్లబట్ట వేశారని విమర్సించారు.
ఎపికి బడ్హెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఖమ్మం టిడిపి ఎంపి నామా నాగేశ్వర రావు అన్నారు. గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కేంద్రం అలసత్వం వహిస్తోందన్నారు. పనికొచ్చే ప్రాజెక్టు ఒక్కటి లేదని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు సర్వే చేస్తారని, రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు ఎందుకు సర్వే చేయడం లేదని గుంటూరు టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. గత బడ్జెట్ కేటాయింపు పనులే పూర్తి కాలేదన్నారు.
ఎపికి మరోసారి అన్యాయం జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేటాయింపులు కంటితుడుపు చర్యగా ఉన్నాయని, భారీ ప్రాజెక్టులు కేటాయించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రానికి సరైన ప్రాధాన్యత లభించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి అన్నారు.
రైలు ఛార్జీలను పరోక్షంగా పెంచారని బిఎస్పీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మాయావతి అన్నారు. ఇంధన ఛార్జీల పెంపు అనేది పరోక్ష వడ్డనే అన్నారు.
ఈ రైల్వే బడ్జెట్ కాంగ్రెసు పార్టీ బడ్జెట్గా కనిపిస్తోందని ములాయం సింగ్ యాదవ్ అన్నారు.
బడ్జెట్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు మొండిచేయి చూపారన జెడి(యు)నేత షరద్ యాదవ్ అన్నారు. బీహార్ వంటి వెనుకబడిన ప్రాంతాలను విస్మరించారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఇక్కడే అత్యధిక ప్రజలు ప్రయాణిస్తున్నా కొత్త రైలు మాత్రం లేదన్నారు. కొత్త ప్రాజెక్టులకు మేం సిద్ధంగా ఉన్నప్పటికీ ఫండ్స్ కేటాయించడం లేదన్నారు.
రైల్వే బడ్జెట్ విషయంలో రైల్వే మంత్రికి తాను కితాబిస్తున్నానని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని చిదంబరం అన్నారు.