రైల్వేసహాయ మంత్రి కోట్ల ఇలాకాకు అంతంత మాత్రమే!
కర్నూలు జిల్లాలో గత కొన్నేళ్లుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయని భావించినప్పటికీ అది నెరవేరలేదంటున్నారు. పెండింగు ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందనుకుంటే నిరాశ ఎదురయిందని అంటున్నారు. పాత ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని చెబుతున్నారు. కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ పేరు కర్నూలు సిటీగా మార్చాలన్న ప్రతిపాదన గురించి, నగరం నుంచి మంత్రాలయానికి రైల్వే మార్గం, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రిజర్వేషన్ కౌంటర్ విస్తరణలపై స్పందన లేదంటున్నారు.
కర్నూలు రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ సౌకర్యం తదితర వాటిపై కూడా ఎలాంటి ప్రకటన లేదని నిట్టూరుస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని ముందుగా ప్రచారం జరిగినా దానికి బదులు వర్క్ షాప్ ప్రతిపాదించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాగన్ల వర్క్ షాప్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నా కార్యరూపం దాల్చే విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నుండి జోధ్పూర్, గాంధీధామ్, త్రివేండ్రం వెళ్లేందుకు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. విశాఖ నుండి ముంబయికి వారానికి రెండు రోజులు నడుస్తున్న రైలును ఇక రోజు నడుపనున్నారు. విశాఖ-నాందేడ్ మధ్య వారానికి రెండురోజులు నడుస్తున్న రైలును మూడు రోజులకు పెంచారు. హౌరా-చెన్నై ఎసి ఎక్స్ప్రెస్, భువనేశ్వర్-తిరుపతి ఎక్స్ప్రెస్ వంటి ఇతర రైళ్లు విశాఖ నుండి వెళ్లనున్నాయి. దీంతో విశాఖకు కొంతమేర ఆశా జనకమే. విజయవాడకు మాత్రం అన్యాయం జరిగిందంటున్నారు.