రైలు ఛార్జీల పెంచం కానీ: బన్సాల్ బడ్జెట్, 'కోట్ల' పైనే ఆశ
రైల్వే ఛార్జీలు పెంచడం లేదని చెప్పిన బన్సాల్ పరోక్షంగా మాత్రం స్వల్పంగా ఛార్జీలు పెంచారు. రైలు ప్రయాణీకులపై స్వల్పంగా ఇంధన ఛార్జ్ వేయనున్నట్లు చెప్పారు. రూ.660 కోట్ల మేర ఇంధన ఛార్జ్ ఉంటుందని చెప్పారు.
బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో బన్సల్ మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యం చేసే విషయంలో రైల్వేలది కీలక పాత్ర అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సోనియా, మన్మోహన్ సింగ్లకు కృతజ్ఞతలు అన్నారు. ప్రజల ఆకాంక్షను రైల్వే బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. రైల్వే నిర్వహణకు వనరుల వ్యయం పెరిగిందన్నారు. భారతీయ జీవనంలో రైల్వేలకు ప్రాముఖ్యత ఉందన్నారు.
భారతీయ రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. అలహాబాద్ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటన తమను బాధించిందన్నారు. నిరంతర నష్టాలు సదుపాయాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. రైల్వేల అభివృద్ధి దేశంతో ముడిపడి ఉందన్నారు. భారతీయ రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. ప్రయాణీకులు చెల్లించే రుసుంకు తగ్గట్లుగా సేవలు అందించాలన్నారు. సురక్షిత, సదుపాయాలతో ప్రయాణం కోరుకోవడం ప్రయాణీకుల హక్కు అన్నారు.
40 శాతం ప్రమాదాలు లెవల్ క్రాసింగ్ వద్ద జరుగుతున్నాయని చెప్పారు. పెరిగిన ఆధునికత వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. రైల్వే సంస్కరణలను అమలుపరుస్తున్నామని, 11వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామన్నారు. రైల్వే నిర్వహణ భారంగా మారిందన్నారు. ప్రయాణీకుల భద్రత అతిముఖ్యమన్నారు. అటవీ ప్రాంతాల్లో పట్టాలపై ఏనుగులు మృతి చెందడంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కాంగ్రెసు పార్టీ మంత్రి రైల్వే బడ్జెట్ప్రవేశ పెట్టడం 17 ఏళ్ల తర్వాత ఇదే కావడం గమనార్హం. దేశంలో అత్యధికంగా ఉద్యోగులు ఉన్న సంస్థ భారతీయ రైల్వేస్. ఇందులో 15.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం 1.4 లక్షల ఖాళీలు ఉన్నాయి. రోజు 11వేల రైళ్లు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి. అందులో నాలుగువేల వరకు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రోజుకు 1.30 కోట్ల మంది ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు.
13వేలకు పైగా క్రాసింగుల వద్ద కాపలాదారులు లేరు. 18వేలకు పైగా క్రాసింగుల వద్ద కాపలాదారులు ఉన్నారు. ఈ ఏడాది సరుకు రవాణా ద్వారా రూ.89,339 కోట్లు, ప్రయాణీకుల ద్వారా రూ.36వేల కోట్లు రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2003-04లో రైల్వేకు రూ.6.159 కోట్ల నష్టం వచ్చింది. అది 2010-11 నాటికి రూ.19,964 కోట్లకు చేరింది. 2012-13 ఏడాదిలో రూ.25,000 కోట్ల నష్టం వచ్చింది.
మంత్రి బన్సల్ నాలుగు నెలల క్రితం రైల్వే ఛార్జీలు పెంచారు. ఛార్జీల పెంపు ద్వారా రూ.6,600 కోట్ల ఆదాయం రైల్వేకు సమకూరుతోంది. ఎసి కేటగిరి నుండే సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయం చేకూరుతోంది. రైల్వేలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు 347 వరకు ఉన్నాయి. అందులో గేజ్ మార్పిడి, కొత్త లైన్లు ఇలా అన్ని ఉన్నాయి. ఈ ఏడాది సరుకు రవాణా లక్ష్యం 102.50 టన్నులు పెట్టుకున్నారు.
రాష్ట్రానికి చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రైల్వే శాఖ సహాయమంత్రిగా ఉండటంతో ఈసారి రాష్ట్రానికి ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆయన కూడా ఆ దిశలో సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఛార్జీలు స్వల్పంగా పెరుగుతాయనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈసారి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.