చంద్రబాబుకు నిరాశ: ఉన్నది కూడా పోయింది
సహకార ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలో టిడిపి మెజారిటీ సొసైటీలు గెలుచుకుని ఉత్సాహంగా ఉంది. అయితే, ఆ ఉత్సాహాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం నీరు గార్చింది. అతి ధీమాతోనే గెలిచే సీటును పోగొట్టుకొన్నామనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. వర ప్రసాద్ సొంతంగా తిరగడం తప్ప పార్టీ నేతలు ఎవరూ ఆయన ఎన్నికను పట్టించుకోకపోవడం కూడా అపజయానికి మరో కారణమని అంటున్నారు.
పోలింగ్కు సరిగ్గా నాలుగు రోజుల ముందు చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అంటున్నారు. పార్టీ అంతర్గత కారణాలు కూడా ఈ ఓటమికి కారణమయ్యాయని వినిపిస్తోంది. వరప్రసాద్ సంఘసేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చి పార్టీపరమైన కార్యక్రమాలను విస్మరించడంతో నాయకులు ఆయనను పట్టించుకోలేదనే కూడా ఉంది.
నిజానికి, గుంటూరు జిల్లా నేతలు ఈ సీటుకు మరో అభ్యర్థిని సూచించారు. అతనికి సీటు దక్కకపోవడంతో వారు సహాయ నిరాకరణ చేశారని భావిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉండి వాటి ఆధారంగా బలమైన ఓటు బ్యాంకు ఉంటేనే ఈ ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని అంటున్నారు.