తెలంగాణ నిలబెట్టుకొండి: సోనియా సమక్షంలో డిమాండ్
ఈ సమయంలో అజిత్ సింగ్ ఉత్తర ప్రదేశ్ నుంచి హరిత ప్రదేశ్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో శరద్ పవార్ మాట్లాడుతూ... తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. ఆయనతోపాటు అజిత్ సింగ్ కూడా గొంతు కలిపారు. 2004లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణను ప్రస్తావించామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానికి సూచించారట. అయితే, విషయాన్ని తర్వాత చర్చించుతామని వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా శరద్ పవార్, అజిత్ సింగ్లు తెలంగాణకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే కొద్ది రోజుల్లో ఆందోళనలు తగ్గుతాయని రాష్ట్రీయ లోకదళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ ఈ నెల ప్రారంభంలో చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రం త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగినప్పటికీ అవి ఒకటి రెండు నెలల్లో తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఇవ్వని పక్షంలో ఆందోళనలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. తెలంగాణ ఇస్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని చెప్పారు. తెలంగాణ కోసం యూపిఏ భాగస్వామ్యపక్షాలు అన్నీ కలిసి కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ రెండు ఏళ్లుగా తెలంగాణపై సంప్రదింపులు జరుపుతూనే ఉందని విమర్శించారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. శరద్ పవార్ కూడా తెలంగాణకు మద్దతు ప్రకటిస్తున్నారు.