గల్ఫ్ జైళ్లలో ఎందరున్నారు?: నామా, చర్యలేవి: పొన్నం
నాలుగేళ్లుగా తాము పార్లమెంటులో ప్రస్తావించినా కేంద్రం తేలిగ్గా తీసుకుంటోందన్నారు. గల్ఫ్ బాధితుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమన్వయం కొరవడిందన్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు సమావేశమయ్యారని, ఏం సమీక్షించారని నామా ప్రశ్నించారు. గల్ఫ్ జైళ్లలో ఎంత మంది భారతీయులు మగ్గుతున్నారో లెక్క తేల్చాలని కోరారు. వారిని విడిపించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
ఎంతమంది జైళ్లలో ఉన్నారని తాము అడిగితే ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. అక్రమ ఏజెన్సీలను నిరోధించలేక పోతున్నారన్నారు. నిరుద్యోగులను కొన్ని ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. నాలుగేళ్లుగా నకిలీ సంస్థలు నిరుద్యోగులను ముంచుతున్నాయన్నారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వారిని విడిపించేందుకు కేంద్రం చొరవ తీసుకువాలని విజ్ఞప్తి చేశారు.
పొన్నం, నామాల ప్రశ్నలకు కేంద్రమంత్రి వాయలార్ రవి సమాధానమిచ్చారు. గల్ఫ్ బాధితుల విషయమై మూడేళ్లలో ఎన్నో ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులపై విచారణ జరుపాలని తాము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమ ఏజెన్సీలు విపరీతంగా పుట్టుకు వస్తున్నాయని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలే దృష్టి సారించాలని చెప్పారు.