మూడు రాష్ట్రాల ఎన్నికలు: ఓట్ల లెక్కింపు ప్రారంభం
నాగాలాండ్లో 60 స్థానాలకు గాను 59 స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60 శాసనసభా స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ సరిహద్దును భద్రతా బలగాలు మూసేశాయి.
నాగాలాండ్లో ఫిబ్రవరి 23వ తేదీన ఓటింగు జరిగింది. ఏడు జిల్లాల్లోని ఎనిమిది శాసనసభా నియోజకవర్గాల్లో 9 పోలింగ్ స్టేషన్లలో బుధవారం రీపోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
మేఘాలయలో తామంటే తామే గెలుస్తామని అధికార కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసేతర పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన పోలింగులో 88 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మేఘాలయలో ఏ పార్టీకి కూడా మెజారిటీ వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
త్రిపురలోని ఎనిమిది జిల్లాల్లో 17 కేంద్రాల్లో వోట్ల లెక్కింపు జరుగుతోంది. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.