వైయస్కు చేతులెత్తి మొక్కినా: కన్నీరు కార్చిన ఎర్రబెల్లి
ఒకటి కాదు... రెండు కాదు... ఎనిమిదేళ్ల నుండి పోరాటం చేస్తున్నామని, అంతా అయిపోయిందని, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని ఎర్రబెల్లి గురువారం కంట నీరు పెట్టుకున్నారు. ఇలా అయితే వరంగల్ నగరానికి కనీసం తాగడానికి కూడా నీటి చుక్క దొరకదన్నారు.
ఉత్తర తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నాలు చేయవద్దని, కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని, సుప్రీం కోర్టుకు కావాల్సిన సమాచారన్నంతా ఇవ్వాలని గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి పలుమార్లు చేతులెత్తి మొక్కి కోరినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ హక్కులు కాపాడేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కళ్లు తెరవాలని టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు సరికాదని కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని తుమ్మల నాగేశ్వర రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇకనైనా జాగ్రత్త పడాలని మధుయాష్కీ సూచించారు.