ట్రాన్స్ట్రాయ్కే పోలవరం టెండర్లు: సిఎందే తుది నిర్ణయం
పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ నివేదిక తనకు ఇంకా అందలేదని ముఖ్యమంత్రి శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, పోలవరం టెండర్లపై సోమవారం ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ రెండు, మూడు రోజులు అధ్యయనం చేసింది. చివరకు ట్రన్స్ ట్రాయ్కే టెండర్లు కట్టబెట్టాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై వివాదాలు సృష్టించవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాజకీయ పార్టీలను కోరారు.
ఇదిలావుంటే, పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ నివేదిక తన వద్దకు రాలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి శనివారం అన్నారు. కమిటీ సిఫార్సులపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై అవసరమైతే తామే రాజకీయ పార్టీలతో మాట్లాడుతామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు మన రాష్ట్ర హక్కులను కూడా కాపాడిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత అవసరం అనుకుంటే బాబ్లీపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయాలకు వాడుకోవద్దని ఆయన రాజకీయ పార్టీలకు సూచించారు.