తప్పు చేస్తే ఉరి తీయండి: శంకరన్న కూతురు సుస్మిత
శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె శనివారం మాట్లాడారు. తమ నాన్న అధికారుల విచారణకు సహకరిస్తారని, ఆయన విచారణకు రాలేకపోతే తన ఇంటికి వచ్చి విచారణ చేసుకోవాలని ఆమె అన్నారు. తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. శంకర్రావుపై 41(ఏ), సీఆర్పీసీ 200 సెక్షన్ల కింద నమోదైన కేసులో విచారణకు సహకరిస్తామని, నాన్న తప్పుచేస్తే ఉరితీసుకోండంటూ మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుస్మిత అవేదనతో అన్నారు.
ఇదే విషయంపై సిఐడి అధికారులకు మాజీ మంత్రి శంకర్రావు కూతురు సుస్మిత లేఖ అందజేశారు. ఇవాళ ఆమె సీఐడీ కార్యాలయానికి వచ్చి లేఖను అధికారులకు ఇచ్చారు. తన తండ్రి శంకర్రావుకు అనారోగ్యంగా ఉన్నందున సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకాలేక పోతున్నారని ఆమె లేఖలో చెప్పారు.
గ్రీన్ఫిల్డ్ భూముల వివాదం కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు పి. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైదరాబాదులోని నేరెడ్మెట్ పోలీసుల నుంచి సిఐడి తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు శనివారం తమ ముందు హాజరు కావాలని సిఐడి అధికారులు శంకరరావుకు నోటీసులు జారీ చేశారు.
అయితే, శంకర్రావు అనారోగ్యంతో సీఐడీ విచారణకు హాజరుకాలేకపోయారు. తండ్రి తరపున కూతురు సుస్మిత సీఐడీ విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేకపోతున్నట్లు ఓ లేఖను శంకరరావు కూతురు ద్వారా సిఐడికి లేఖను పంపించారు.