చంద్రబాబు కసరత్తు: రేసులో నటుడు బాబు మోహన్
సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. శాసన మండలికి వెళ్లాలన్న ఆసక్తి తనకు ఉందని ఆయన బాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. బాబు మోహన్ గతంలో మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. దీంతో శాసనమండలికి వెళ్లాలని బాబు మోహన్ భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మహిళా నేత నళిని కూడా బాబుకు ఎమ్మెల్సి టిక్కెట్ పైన విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబును నిత్యం పలువురు కలుస్తున్నారు. బాబును కలిసిన నేతల్లో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ప్రతిభా భారతి, కళా వెంకట్రావు తదితరులు ఉన్నారు. అలాగే హైదరాబాద్కు చెందిన మస్కతి కుమారుడు ఆలీ మస్కతి కలిశారు. తన తండ్రి మస్కతి స్థానంలో ఈసారి తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు శనివారం ఉదయం బాబును కలిశారు.
వరుసగా నేతల విజ్ఞప్తులతో బాబు ఇబ్బందులు పడుతున్నారట. ఎవరికి అవకాశం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారట. ఎమ్మెల్సీ టిక్కెట్ను ఆశిస్తున్న పలువురు నేతలు సీనియర్లు, పార్టీ కోసం పని చేసే వారే కావడంతో ఎవరికివ్వాలనే అంశంపై బాబు కసరత్తు చేస్తున్నారట.