బాబ్లీపై బాబు డ్రామాలు, అప్పుడు ఏడవలేదేం?: కెసిఆర్
అప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు ఉన్నారన్నారు. అప్పుడు బాబ్లీ ప్రాజెక్టుపై వారు ఎందుకు నోరు మెదపలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు, తుమ్మల ఆపించకపోగా ఇప్పుడు దానిని ఉపయోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబ్లీపై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న వారికి తెలంగాణ కోసం వెయ్యి మంది చనిపోతే ఏడుపు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
బాబ్లీ పైన సుప్రీం కోర్టుకు మొదట తెరాసనే వెళ్లిందన్నారు. బాబ్లీ కట్టడంపై తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించానని అన్నారు. ఓ విధంగా త్రిసభ్య కమిటీ అని సుప్రీం చెప్పడం ద్వారా మనమే గెలిచామన్నారు. పోతిరెడ్డిపాడు, కండలేరు ప్రాజెక్టు పైన టిడిపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బాబ్లీ పైన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న అభ్యంతరమేమిటన్నారు. విపక్షాలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. కిరణ్ వెంటనే ఈ అంశంపై స్పందించాలన్నారు.
తెలంగాణ వస్తుందని, న్యాయమే గెలుస్తుందని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల పాపం కాంగ్రెసు, టిడిపిలదే అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగం పేరిట గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని, తెలంగాణ వచ్చాక రెగ్యులరైజ్ చేస్తామన్నారు. సీమాంధ్రతో పోలిస్తే తెలంగాణలోనే ఆదాయం ఎక్కువ అని, తెలంగాణ వస్తే అక్రమంగా తరలించికుపోతున్న ఉద్యోగాలు మనకే దక్కుతాయన్నారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేత బాబు ఘనతే అన్నారు.
చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతాడన్నారు. పోతిరెడ్డి పాడుకు అనుమతి లేదన్నారు. సీమాంధ్రకు అక్రమంగా తరలించే జలాలపై ఎందుకు ఇతర పార్టీలు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరం లేదని ఆయన అన్నారు. మహిళల్లో ప్రతిభను దేశాభివృద్ధికి వాడుకోవాలని అన్నారు.