షర్మిలా! వైయస్ వల్లే నష్టం, నిరూపిస్తా: యాష్కీ సవాల్
బాబ్లీ ప్రాజెక్టులు పునాదులు వేసినప్పుడే వైయస్ దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదన్నారు. బాబ్లీ నిర్మాణాన్ని ఆపడంలో నిర్లక్ష్యం వహించిన వైయస్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని, ఈ విషయాన్ని జగన్ పార్టీ నేతలు గుర్తించాలన్నారు. బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా విఫలమయ్యారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగే నష్టంపై తాను ఎప్పటినుంచో గళమెత్తుతున్నానని చెప్పారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనను చూసి నేర్చుకోవాలన్నారు. బాబ్లీ నిర్మాణం ప్రారంభమైన సమయంలో నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన వైయస్ వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించానని, న్యాయస్థానంలో వ్యాజ్యం ఉండగా బాబ్లీ నిర్మాణం ఎలా జరుగుతుందంటూ వైయస్ రుసరుసలాడారన్నారు. తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందన్న తన ఆందోళనను తేలిగ్గా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాబ్లీపై పెద్ద మాటలు చెబుతున్న షర్మిల వాస్తవాలు గ్రహించి మాట్లాడాలన్నారు. బాబ్లీపై సుప్రీం కోర్టు తీర్పును రాజకీయం చేసేందుకు టిడిపి, తెరాసలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టును ఆంధ్ర కాంట్రాక్టర్లే నిర్మించారని విమర్శించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తామన్న ఉత్తర కుమారులు ఏ కలుగులో దాగున్నారని యాష్కీ ప్రశ్నించారు. బాబ్లీ విషయంలో రాజకీయంగా ప్రజల్లో అనవసర భయాందోళనలకు గురిచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేయాలన్నారు.