మూడ్రోజులు జైల్లో ఉన్నా, లాఠీ దెబ్బలు తిన్నారు: బాబు
బాబ్లీపై కిరణ్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలను తూర్పారబట్టారు. సుప్రీం తీర్పు వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగలేదని ప్రభుత్వం సమర్థించుకోవటం దారుణం అన్నారు. బాబ్లీపై పోరాటం చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని, తాను మూడు రోజులు జైలులో ఉన్నానని, తమ నాయకులపై లాఠీ దెబ్బలు పడ్డాయని గుర్తుచేశారు. పరిపాలనే చేతగాని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ తనను రుణమాఫీ ఎలా సాధ్యమని ప్రశ్నించడం విడ్డూరమన్నారు.
మూడేళ్లుగా డెల్టా ఆధునికీకరణ పేరుతో నిధులు దోచుకుంటున్నారని విమర్శించారు. వైయస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరిట 80 వేల కోట్లు ఖర్చుపెట్టి 8వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తికాకపోవడం వల్లే రైతులకు సాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. ఈ విషయంలో వైయస్తో పాటు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు విఫలమయ్యారన్నారు.
అంతకుముందు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వాటాలేసుకుని తింటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతినటం వైయస్ నేర్పగా, కిరణ్ ఆ పాలసీని చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కొడాలి సెంటర్లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ నేతలను తూర్పారపడ్డారు. మురుగుకాల్వల్లోని గుర్రపుడెక్క తొలగించటం ఎంత కష్టమో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని అరికట్టడం అంత కష్టమని తెలిపారు.