వైయస్ జగన్ విడుదల కోరుతూ 24 కిమీ పాదయాత్ర
ఈ పాదయాత్రను పార్టీ జిల్లా కన్వీనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్ర బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వరకు 24 కిలోమీటర్లు సాగనుంది. ఈ పాదయాత్రలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరభద్ర స్వామి ఆలయంలో జగన్ విడుదలను కోరుతూ వారు ప్రత్యేకంగా పూజలు చేయనున్నారు.
జగన్ విడుదలను కోరుతూ అదిలాబాదు జిల్లా బాసరలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. పదమూడు మంది యువకులు నిజామాబాద్ జిల్లా నుంచి బాసరకు పాదయాత్రగా వచ్చారు. బాసర వచ్చిన వారు తొలుత గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం జగన్ కోసం బాసర సరస్వతి దేవి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించారు.
కాగా గతేడాది మే 27వ తేదిన వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన అరెస్టై ఇప్పటికి తొమ్మిది నెలలు దాటింది. పలుమార్లు బెయిల్ కోసం నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నుండి సుప్రీం కోర్టు వరకు వెళ్లినా ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు.