మోనికా ఎంబియే.. గాడ్జెట్స్ దొంగ: డిఎస్పీ కాల్చివేత
ఢిల్లీలోని దీన్పుర్కి చెందిన మోనికా నోయిడాలోని ఓ కళాశాలలో ఎంబిఏ చదువుతోంది. ఆమెకి ఖరీదైన సెల్ ఫోన్ల పైన ఆశ కలిగింది. దీంతో మెట్రో రైళ్లలో జేబు దొంగతనాలు చేయడం ప్రారంభించింది. ఆమె దొంగతనాలు సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆమెపై ప్రత్యేక నిఘా ఉంచి అరెస్టు చేశారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటరియేట్ స్టేషన్స్ మధ్య ఈమె దొంగతనాలకు పాల్పడుతుండేది.
డిఎస్పి కాల్చివేత
భూమి వివాదంలో గ్రామ పెద్ద హత్య జరిగిన గ్రామంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన డిఎస్పిని ఉత్తరప్రదేశ్లో కాల్చి చంపారు. తన భర్తపై దాడి చేసి కాల్చి చంపారని, దీని వెనుక మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ 'రాజాభయ్యా' హస్తం ఉందని డిఎస్పి జియా ఉల్ హక్ భార్య ప్రవీణ్ ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఆదివారం సాయంత్రం కుందా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాల్పులకు గురైన డిఎస్పి జియాఉల్ హక్.. తీవ్రమైన గాయాలతో శనివారం రాత్రి పొద్దు పోయిన తరువాత మరణించారని అడిషనల్ డిజిపి అరుణ్ కుమార్ తెలిపారు.
కుందా పోలీస్స్టేషన్ పరిధిలోని బలిపూర్ గ్రామంలో శనివారం జరిగిన ఘర్షణలో గ్రామపెద్ద హత్యకు గురయ్యారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడకు వెళ్లిన డీఎస్పీ జియా ఉల్ హక్ తదితరులపై గ్రామం వెలుపలే దాడి జరిగింది. తరువాత కాల్పులు జరిపారని ఆరోపణ. ఈ దాడిలో పలువురు గ్రామస్తులు కూడా గాయపడ్డారు.
ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి రాజా భయ్యా మాట్లాడుతూ, "షాక్లో ఉన్న ఆమె(డిఎస్పి భార్య)ను ఎవరో తప్పుదోవ పట్టించార''ని అన్నారు. డిఎస్పి మృతిని దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఉత్తర ప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బిఎస్పి, బిజెపిలు విమర్శలకు దిగాయి. కాగా ఈ రోజు రాజు భయ్యా తన రాజీనామాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఇచ్చారు.