ఇప్పుడా.. దోశతో పోల్చుతారా?: పొంగులేటి X హరీష్
వాయలార్ రవి గతంలోను తెలంగాణపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారన్నారు. తమ మనోభావాలను కించపర్చేలా మాట్లాడిన వాయలార్ రవి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ఓ నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతలో హరీష్కు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అడ్డు తగిలారు.
ఇక్కడ తెలంగాణ ఏమిటని హరీష్ను అతను ప్రశ్నించారు. దానిపై హరీష్, ఇతర తెరాస నేతలు తీవ్రంగా స్పందించారు. తాము తెలంగాణ వాదం పైనే గెలిచామని, తమ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, తాము అది తప్ప మరో విషయమే మాట్లాడమని ధీటుగా స్పందించారు. తమకు మరో అజెండా ఏమీ లేదన్నారు.
తాము రాత్రికి రాత్రే తెలంగాణ ఇవ్వమని డిమాండ్ చేయడం లేదన్నారు. కానీ, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బహిరంగ సభల్లో తెలంగాణపై హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసమే పొంగులేటి తమను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. అంతలో ఫెర్నాండేజ్ కలుగు చేసుకొని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.