బాబే నాయక్: పవర్సెంటర్పై బాలకృష్ణ, రాత్రంతా యాత్ర
నారా లోకేశ్ అయినా మరెవరయినా పార్టీలో కష్టపడి పని చేయాల్సిందేనన్నారు. సోమవారం పాదయాత్రలో పాల్గొన్న ఆయన కృష్ణా జిల్లా కొమరవోలులో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. పాదయాత్రకు మంచి స్పందన ఉందని, 2014లో టిడిపికి అధికారం తథ్యమని చెప్పారు.
రాత్రంతా బాబు యాత్ర!
మరోవైపు కురుముద్దాలి నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత గుడివాడ సమీపంలోని గాంధీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బసవద్దకు బాబు చేరుకున్నారు. కొమరవోలు నుంచి శిబిరం వరకు బాలయ్య బాబుతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు(మంగళవారం) యాత్ర గుడివాడలో జరుగనుంది. సోమవారం పదహారు కిలోమీటర్లు నడిచారు.
యాత్రలో బాబు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అన్నిరకాల దోపిడీలు అయిపోయాయని, ఆధార్ పేరుతో పేదల డబ్బులు కాజేసేందుకు కాంగ్రెస్ దొంగలు కుట్ర పన్నుతున్నారన్నారు. దేశ పురోభివృద్ధికి తోడ్పడే విద్యావ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దాని వల్ల ఈనాడు సమాజం పెడదోవ పట్టే ప్రమాదం ఉందన్నారు. ఈ పాపం కాంగ్రెస్కు తగిలి తీరుతుందన్నారు.
కోతల వల్ల విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతమన్నారు. కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు లాంతరు కింద చదువుకుని మహానుభావుడయ్యారు. ఆ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకెళ్లాలని, కరెంటు కష్టాలకు కుంగిపోవద్దన్నారు. లాంతర్ల సాయంతోనైనా చదువు కొనసాగించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రభుత్వాలు విద్యని ఉచితంగా అందిస్తుండగా, మనదేశంలో మాత్రం ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.
అవినీతి సొమ్ముతో బొజ్జలు నింపుకోవడం తప్ప కాంగ్రెస్ మంత్రులు విద్యావ్యవస్థపై దృష్టి సారించలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని అనాథని చేశారని విమర్శించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దొంగలు రాజ్యమేలారని, వారిలో కొందరు ఇప్పుడు జైళ్లలో ఉండగా, మరికొందరు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కొనసాగుతున్నారన్నారు.