దోశ అంటే పిండిలా రుబ్బేస్తారు: వాయలార్కు కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇవ్వాలని ఉంటే ఇవ్వండని అంతేకాని దోశ, వడ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై పరిష్కారం దోశ వేసినంత సులువు కాదని కేంద్రమంత్రి వాయలార్ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనకు అలా మాట్లాడటానికి తెలివి ఉండాలన్నారు. ఆయనవి పలుపు మాటలని నిప్పులు చెరిగారు. కాంగ్రెసు నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలకు ఏమాత్రం పౌరుషం లేదన్నారు. తాము తెలంగాణను యాచించేది లేదని శాసించి తెచ్చుకుంటామన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఉద్యమంలో కలిసి రాకపోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను తెలంగాణ ఇవ్వమని అడగగలమే కాని బడితె పట్టుకొని కొట్టలేమన్నారు.
తెలంగాణ కాంగ్రెసు నేతలు సన్నాసులని, వాయలార్ వ్యాఖ్యలపై వారు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆర్టీసిలో మహిళ పోస్టులను వారికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆర్టీసి నియామకాల్లో అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు.