బంగ్లాలో కొత్త అల్లుడు ప్రణబ్!: మోడీ వ్యాఖ్యపై స్పందన
ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ పూర్వీకుల ఊరు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. నరైల్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న తన అత్తవారి పాత ఇంటికి ప్రణబ్ దంపతులు మంగళవారం వెళ్లారు. అక్కడ ప్రణబ్ను అందరూ దాదాబాబు అని పలకరించారు. దాదాబాబు అంటే పెద్ద బావ అని అర్థం. దాదాబాబు (పెద్దక్క భర్త)ను మేం ఊలుధాని, మంగళ్ప్రదీప్లతో స్వాగతించామని, ఆయన మా అక్కయ్య సువ్రా దీతో కలిసి వచ్చారని భారత ప్రథమ మహిళ సువ్రా ముఖర్జీ సోదరి ఒకరు తెలిపారు. బంగ్లాదేశీ వైమానిక దళ హెలికాప్టర్లో ప్రణబ్ దంపతులు నరైల్ పట్టణానికి వెళ్లారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అక్కడకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రబిలా గ్రామానికి చేరుకున్నారు. దాదాబాబుకు ఒక బంగారు గొలుసు, తమ దీదీకి చీర బహుమతిగా ఇచ్చారని బప్పీ తెలిపారు. అత్తవారింట్లో తనను కొత్త అల్లుడిలా చూసుకున్నారని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ప్రణబ్ కోసం బంధువులు పుట్టింటికి సమీపంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. స్వీట్స్ తినిపించారు. ఈ పర్యటన 90 నిమిషాలు సాగింది. ప్రణబ్ దంపతులు స్థానిక ఆలయంలో పూజలు కూడా చేశారు.
ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవాలని బంగ్లాదేశ్ పార్టీలకు సూచించారు. తనను తన అత్తవారి గ్రామంలో సొంత అల్లుడిలా చూసుకున్నారన్నారు. అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పైన స్పందించారు. మన్మోహన్ కంటే ప్రణబే ప్రధాని పదవికి తగినవాడని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు ప్రణబ్ను ప్రశ్నిస్తే ఎవరిని ఉద్దేశించి అన్నారో అంతుపట్టకుండా.. "మీరే అంచనా వేసుకోండి..'' అని పేర్కొన్నారు.