శ్రీలక్ష్మికి షాక్: ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి
ఐపిసి, పిసి యాక్టుల కింద విచారించేందుకు అనుమతి లభించింది. ఓఎంసికి గనుల లీజు కట్టబెట్టడంలో శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. శ్రీలక్ష్మిపై ఐపిసి అభియోగాలను సిబిఐ కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది. తన బెయిల్ పిటిషన్ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కేంద్రం ఆమెను విచారణకు అనుమతించడం ఎదురు దెబ్బే!
సిబిఐపై గాలి
సిబిఐ తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటూ బెయిలును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని గాలి జనార్ధన్ తరఫు న్యాయవాది సిబిఐ న్యాయస్థానానికి బుధవారం చెప్పారు. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాలను గుర్తించాలని చెబుతోందని, సరిహద్దులు తేలకుండా దీన్ని ఎలా నిర్దారిస్తుందని ప్రశ్నించారు. ఓఎంసి కేసులో నిందితుడైన గాలి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన సిబిఐ జడ్జి బుధవారం విచారణ చేపట్టారు.
ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షకంటే ఎక్కువకాలం గాలిని జైల్లో ఉంచాలని సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ సంస్థ దర్యాఫ్తులోనే లోపాలున్నాయని, కర్నాటకలోని కేసులను ప్రస్తావిస్తూ ఇక్కడ బెయిలును అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన లీజుల్లో తవ్వకాలే జరపలేదని సిబిఐ చెబుతోందని, అలాంటప్పుడు అక్రమ మైనింగుకు అవకాశం ఎక్కడిదని వాదించారు. గురువారం విచారణ కొనసాగుతోంది.