కార్తికరెడ్డితో వైరం: జయసుధ రాజీనామా హెచ్చరిక
బండ కార్తిక రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాంతో ఆమెకు టికెట్ ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో జయసుధ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
జయసుధ తీరు పట్ల వారు మనసు నొచ్చుకున్నట్లు చెబుతున్నారు. దాంతో బండ కార్తీకకు ఎమ్మెల్సీ సీటు ఇస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జయసుధ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కార్తీక కుటుంబానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు దండిగా ఉన్నాయని, దాంతో కార్తిక రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.
బండ కార్తిక రెడ్డికి, జయసుధకు చాలా కాలంగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. బండ కార్తికరెడ్డి తీరుపై జయసుధ చాలా సార్లు మనసు నొచ్చుకున్నారు. వివాదం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది. ముఖ్యమంత్రి సర్ది చెప్పడంతో కాస్తా సద్దుమణిగింది. ఇప్పుడు బండ కార్తిక రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తనపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని జయసుధ భావిస్తున్నట్లు సమాచారం.