దిల్షుక్నగర్ పేలుళ్ల ఉగ్రవాదిని గుర్తించాం: డిజిపి
సిసిటీవీ కెమెరా ఫుటేజ్ సాయంతో ఉగ్రవాదిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. బాంబు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమ పద్ధతిలో తాము విచారణ జరుపుతున్నామని దినేష్ రెడ్డి చెప్పారు. పేలుళ్లకు 20 నిమిషాల ముందు ఇద్దరు వ్యక్తులు సైకిళ్లపై వెళ్లడం సిసి టీవీ కెమెరాల్లో నమోదైందని ఆయన అన్నారు. స్పష్టంగా కనిపిస్తున్న ఉగ్రవాది ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. శివరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ప్రస్తుతం నిఘా వర్గాలు సాధారణ హెచ్చరికలు జారీ చేశాయని అన్నారు. వాణిజ్య భవనాలకు, బహుళ అంతస్థుల భవనాలకు సిసిటీవీలు లేకుండా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మాల్స్, సినిమా హాళ్లు, రద్దీ ప్రాంతాల్లో డెకాయ్ ఆపరేషన్లు చేస్తామని చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో మొత్తం 3,500 హై రెజల్యూషన్ సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సిసిటీవీ కెమెరాలు విద్యుత్తుతో సంబంధం లేకుండా బ్యాటరీలతో పనిచేస్తాయని అన్నారు. హైదరాబాదులో సున్నితమైన ప్రాంతాలను గుర్తించామని, సున్నిత ప్రాంతాల్లో నిఘా కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్లను కలిపే ప్రక్రియ కొనసాగుతుందని, గ్రేటర్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని డిజిపి చెప్పారు.
రాష్ట్రంలో అదనంగా నాలుగు కమిషనరేట్లు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో అత్యధునాతన కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉగాది పర్వదినంలోగా డయల్ 100ను అప్గ్రేడ్ చేస్తామని దినేష్ రెడ్డి చెప్పారు.