పేలుళ్లపై తప్పుదోవ పట్టించిన కేరళ వ్యక్తి అరెస్టు: సిపి
వివేక్ నాయర్ ఈ మెయిల్, ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి పోలీసులను తప్పు దోవ పట్టించాడని ఆయన చెప్పారు. కంప్యూటర్ నిపుణుడిగా వివేక్ తెచ్చిన సమాచారాన్ని విశ్లేషించి పరిశీలించామని, వివేక్ ఇచ్చిన సమాచారం తప్పని ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ సాంకేతిక పరిశోధన బృందం తేల్చిందని ఆయన వివరించారు.
తప్పుడు సమాచారమంతా వివేక్ తన కంప్యూటర్లో సృష్టించిందేనని ఆయన అన్నారు. ఫలానా చోట బాంబు ఉందంటూ చాలా మంది నకిలీ ఫోన్లు చేస్తున్నారని, రోజుకు 15 నుంచి 20 దాకా తప్పుడు కాల్స్ వస్తున్నా బేఖాతరు చేయకుండా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.
తమకు వచ్చిన ప్రతి సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని అనురాగ్ శర్మ చెప్పారు. శివరాత్రి సందర్భంగా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో పోలీసుల సోదాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
ఫిబ్రవరి 21వ తేదీన దిల్షుక్నగర్లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. వంద మందికి పైగా గాయపడ్డారు.