వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు సత్యసాయిబాబా భక్తుడు
వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణించడంతో ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గురువారం వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మదురో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
నేడు చావెజ్ అంత్యక్రియలు
కాగా, రెండు రోజుల క్రితం కన్నుమూసిన వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. అంత్యక్రియల అనంతరం ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం మిలటరీ మ్యూజియంలో గాజుపెట్టెలో భద్రపర్చినట్లు తాత్కాలిక అధ్యక్షుడు నికోలస్ మదురో చెప్పారు.
ప్రజలు ఆయనను ఎప్పటికీ చూసుకోవచ్చునని తెలిపారు. హ్యూగోను చూసేందుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. పలువురు దేశాధినేతలు శ్రద్ధాంజలి ఘటించారు. నేడు జరిగే అంత్యక్రియల్లో సుమారు ఇరవై రెండు దేశాల ప్రతినిధులు పాల్గొనే అవకాశముంది. భారత్ నుంచి కేంద్రమంత్రి సచిన్ పైలట్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరోవైపు చావెజ్ అంత్యక్రియల అనంతరం ఆయన పార్థివ మృతదేహాన్ని మిలటరీ మ్యూజియంలో గాజుపెట్టెలో శాశ్వత సందర్శనార్థం భద్రపర్చనున్నారు.