జగన్ పార్టీ సెల్ఫ్గోల్?: విజయమ్మ ఇంటర్వ్యూ పాఠం...
వచ్చే ఎన్నికల అనంతరం కాంగ్రెసు ఆధ్వర్యంలోని యూపిఏకు కూడా మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం ద్వారా అధికార కాంగ్రెసు పార్టీ పట్ల వైయస్సార్ కాంగ్రెసు కొంత సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, కాంగ్రెసు విలీనం కోరుకుంటుండగా తాము మాత్రం అందుకు సుముఖంగా లేమని, అవసరమైతే మద్దతుకే పరిమితమవుతామని విజయమ్మ చెబుతున్నారని, జగన్ కాంగ్రెసుతో కలిసిపోతారని చెప్పేందుకు ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలంటున్నారు.
విజయమ్మ ఏమన్నారు?
సోనియా, కాంగ్రెసు గురించి అడిగినప్పుడు.. తమ పట్ల వారి వ్యవహార శైలి తమను బాధించిందని, వేదనకు గురి చేసిందన్నారు. తమను అవమానించారన్నారు. తాము ఏం చేశామని ఇలా చేశారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారని, పార్టీని రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చారని చెప్పారు. ఆయన సిఎం అయ్యాక సంక్షేమ పథకాలకు నెహ్రూ-గాంధీ కుటుంబాల పేర్లు పెట్టారని అన్నారు.
2009లో తన తనయుడు జగన్ వెంటనే ముఖ్యమంత్రి కావాలని భావించలేదని, 2014 ఎన్నికల్లో కాంగ్రెసు ద్వారానే ప్రజల్లోకి వెళ్దామని చూశారన్నారు. అంతలోనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం వైయస్ కుటుంబంలో విబేధాలు సృష్టించే ప్రయత్నాలు చేసిందని, జిల్లాలోను సమస్యలు సృష్టించిందన్నారు. సోనియా గాంధీకి తమ పట్ల సానుకూలత ఉంటే జగన్ తొమ్మిది నెలలుగా జైల్లో ఎందుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఓ తల్లిగా రాహుల్ గాంధీని సోనియా ఎలాగైతే ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారో, తాను అలాగే జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. జగన్ నిర్దోషిగా నిరూపించుకుంటారని, ప్రజల విశ్వాసాన్ని పొందుతారన్నారు. సోనియాకు తమ పట్ల సానుకూలత ఉంటే జగన్ పట్ల వేధింపులు ఉండేవి కావన్నారు. జగన్ పాపులారిటీని సోనియా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోలేదన్నారు. తద్వారా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఇబ్బందుల్లో ఉందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కోసం చిత్తశుద్ధితో పని చేసిన వైయస్ ఇమేజ్ని మలిన పర్చే ప్రయత్నం చేశారన్నారు.
రాహుల్ గాంధీకి తెలియకుండా జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. 2010లో జగన్ కాంగ్రెసును వీడేందుకు సిద్ధపడిన సమయంలో వద్దని చెప్పానని, పార్టీతోనే వెళ్లమని సూచించానన్నారు. జగన్ను జైలుకు పంపించి తొమ్మిది నెలలవుతున్నా అతనిపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేకపోయారన్నారు. కాంగ్రెసు పార్టీలో విలీనం అయ్యేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు.
ఎన్నికలకు ముందు పొత్తును ఆమె తోసిపుచ్చారు. ఎన్నికల అనంతరం పొత్తులపై ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, బిజెపి వంటి పార్టీతో మాత్రం పొత్తు ఉండదన్నారు. యూపిఏను లేదా థర్డ్ ఫ్రంట్కు తాము మద్దతు పలుకుతామని చెప్పారు. తాము కేంద్ర ప్రభుత్వంలో చేరి కీలక మంత్రి పదవులు అడుగుతామన్నారు. 2014లో ప్రధాని అభ్యర్థిత్వాన్ని పెద్ద రాష్ట్రాలే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.