నామినేషన్ వేశారు.. గెలిచారు!: తెరాస, జగన్కు చెరొకటి
కాంగ్రెసు పార్టీ తరఫున.. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోలగట్ల వీరభద్ర స్వామి, సంతోష్ కుమార్, లక్ష్మీ శివ కుమారి, తెలుగుదేశం పార్టీ తరఫున యనమల రామకృష్ణుడు, శమంతకమణి, సలీం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆదిరెడ్డి అప్పారావు, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మహమూద్ అలీలు నామినేషన్ వేశారు. అభ్యర్థులు ఎక్కువ మంది నామినేషన్ వేయక పోవడంతో వీరి ఎన్నిక ఖాయమైంది. అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉంది.
రేపు నామినేషన్లను పరిశీలించి ఈ నెల 14వ తేదిన ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. పది మంది అభ్యర్థులే నామినేషన్ వేయడంత ఈ నెల 21న జరగాల్సిన ఎన్నిక ప్రక్రియ లేనట్లే. కాగా, ఏకగ్రీవంగా మహమూద్ అలీని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందించారు. తెరాస భవనంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
సద్వినియోగం చేసుకుంటాం
ప్రజా సమస్యల పైన పోరాడేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని యమనల రామకృష్ణుడు చెప్పారు. నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడారు. ఏ ఒక్కరి ప్రభావం వల్లనో టిడిపిలో నేతల ఎంపిక జరగదన్నారు. బిసి, ఎస్సీ, మైనార్టీ అభ్యర్థుల ఎంపిక పార్టీ సమష్టి నిర్ణయమే అన్నారు. తొలి నుండి టిడిపి మహిళలకు పెద్ద పీట వేస్తోందని శమంతకమణి అన్నారు. బాబును ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేస్తామని సలీం అన్నారు.
మైనార్టీలకు కాంగ్రెసులోనే న్యాయం
కాంగ్రెసు పార్టీతోనే అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.