ఆరో అభ్యర్థిపై బొత్స వర్సెస్ కిరణ్: కెసిఆర్ అంతర్మథనం
తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆదిరెడ్డి అప్పారావు ఇప్పటికే నామినేషన్ వేశారు. మరో అభ్యర్థిగా తెరాస నిలబెడుతోంది. కాంగ్రెసు ఆరో అభ్యర్థిని నిలబెట్టని పక్షంలో పోటీ జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసే అవకాశముంది. కాంగ్రెసు ఆరో అభ్యర్థిని నిలబెడితే మాత్రం పోటీ ఖాయమవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలనే అంశంపై తెరాస ఆలోచిస్తోంది.
నిన్నటి వరకు ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని తెరాస భావించింది. ఆరో అభ్యర్థిని నిలబెడతామని కాంగ్రెసు ప్రకటించడంతో తెరాసలో అంతర్మథనం ప్రారంభమైంది. అయితే, ఈ రోజు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు కాంగ్రెసు ఆరో అభ్యర్థిత్వంపై ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరో అభ్యర్థి కోసం పట్టుబడుతుండగా... ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం విముఖతతో ఉన్నారట.
ఏకగ్రీవంగా పూర్తి చేసుకుంటే బావుంటుందనే భావనలో బొత్స ఉన్నారట. కానీ, ఎన్నికలు అనివార్యమైనా ఆరో అభ్యర్థి కోసం కిరణ్ ఆసక్తిగా ఉన్నారట. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు తేలే అవకాశం లేదు. గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు రెండుసార్లు తెరాసకు షాక్ ఇచ్చాయి. తాజాగా మరోసారి అదే పరిస్థితి ఎదురైతే మంచిది కాదని భావించి జాగ్రత్తగా పావులు కదుపుతోంది.
కాంగ్రెసు ఆరో అభ్యర్థిని నిలబెడితే తమకు వచ్చే ఓట్లు లెక్కలు వేసుకుంటోంది. తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపి ఓటింగుకు దూరంగా ఉండనుంది. నాగం జనార్ధన్ రెడ్డి తెరాసకు మద్దతిస్తానని చెప్పారు. తమకున్న బలానికి ఎందరు కలిస్తే గెలుస్తాం? ఎవరెవరు మద్దతిస్తారు? కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎందరు కలిసి వస్తారు? అనే అంశంపై చర్చిస్తున్నారు. కాంగ్రెసు ఆరో అభ్యర్థిని నిలబెడితే మజ్లిస్ మద్దతు కోసం కెసిఆర్ స్వయంగా ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.