దాడి ఆవేదన సరైనదే, నన్ను భార్యే పోషిస్తోంది: బాబు
కాగా, చంద్రబాబు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల మాట్లాడారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసులు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు కాదని, ఒకటి తల్లి పాము.. ఇంకొకటి పిల్లపామన్నారు. వీటిలో పిల్లపాముకి విషమెక్కువ అని నిప్పులు చెరిగారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాంటి వాళ్లు కిరికిరిలు చేసి ర్రాష్టాన్నే అధోగతి పాలుచేశారన్నారు.
అందుకే ర్రాష్టాన్ని బాగుచేద్దామని, ఒక గాటికి తీసుకువద్దామని శరీరం సహకరించకపోయినా మీకోసం వస్తున్నానని చెప్పారు. టిడిపికి మతం, కులం వంటి వివక్ష లేవీ లేవని, బిసిలకు తాము ఒక స్పష్టతతో కూడిన డిక్లరేషన్ను ప్రకటించామని, కాంగ్రెస్ వాళ్లు ఇప్పటిదాకా బిసిలకు ఏదైనా చేశారనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిసిలకు అసెంబ్లీలో వంద సీట్లు ఇస్తామని టిడిపి ప్రకటించిందని.. అంత దమ్ము మరే పార్టీకైనా ఉందా అని ప్రశ్నించారు.
స్వార్థం కోసం ఈ పాదయాత్ర చేయడం లేదని, ప్రజల ఇబ్బందులను గమనించే ముందుకు సాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. వైయస్కు తాను పెద్ద కుమారుడిని అని గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా చెప్పారని, ఆయనేమో రాష్ట్రంలో బంగారమే లేనంతగా దోచేశారని, రెండవ కుమారుడు జగన్ లక్ష కోట్లు తిన్నాడన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారం మంచం లేదు గానీ, గాలి జనార్దనరెడ్డి వంటి వారికి బంగారు మంచం, కంచం ఎలా వచ్చాయో ఓసారి ఆలోచించాలన్నారు.
తనకున్నది ఒకే అబ్బాయని, బాగా చదివించి అతణ్ని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతున్నానని, తన భార్య వ్యాపారం చేస్తోందని, ఒక రకంగా చెప్పాలంటే ఆమే తనకు తిండిపెడుతోందన్నారు. ఇంట్లో భార్యకు, కోడలికి కూడా స్వేచ్ఛ ఇచ్చానని, వాళ్లు కూడా కష్టపడే తత్వాన్నే అలవర్చుకున్నారన్నారు. 2004కు ముందు అప్పుల్లో ఉన్న వైయస్ కుటుంబం ఇప్పుడు బెంగళూరులోను, లోటస్పాండ్లోను ప్యాలెస్లు కట్టారన్నారు.