కిరణ్ రెడ్డి, బొత్సలపై తెలంగాణ నేతల మండిపాటు
సమావేశంలో పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం తదితర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ అతివాదులుగా పేరు పడిన వారి సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రావడం విశేషం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తీసుకుంటున్న నిర్ణయాలను వారు తప్పు పట్టారు.
సమావేశానంతరం తెలంగాణ ప్రాంత మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చొరవ చూపాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించడంతో పాటు కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.
తమ ఆవేదనను, ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని సత్వరమే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన సోనియాను, రాహుల్ను కోరారు. తెలంగాణపై ఇచ్చిన మాటను పార్టీ అధిష్టానం నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా మాత్రమే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు తాను వివరంగా మాట్లాడుతానని ఆయన చెప్పారు.