రామ్సింగ్ది ఆత్మహత్యే: ఉరేసుకున్నాడని నిర్ధారణ
కాగా, ఢిల్లీలో జరిగిన వైద్య విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు అతను తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. రాంసింగ్ ఉరేసుకుని తీహార్ జైలులోని నెంబర్ 3లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపిన బస్సు డ్రైవర్ అతను. బస్సులో అతి దారుణంగా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో రాంసింగ్తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో అతని సోదరుడితో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నాడు. మైనర్ బాలుడిని జ్యువైనల్ హోమ్కు పంపించగా, మిగతావారిని తీహార్ జైలులో పెట్టారు.
తీహార్ జైలులో వారి పట్ల ఇతర ఖైదీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అరెస్టయినవారిలో రాంసింగ్ సోదరుడు కూడా ఉన్నాడు. రాంసింగ్, ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లపై వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో అభియోగాలు మోపారు. 23 ఏళ్ల నిర్భయపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన బస్సులో అతి కిరాతకంగా అత్యాచారం జరిగింది. బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచింది.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంపై ఢిల్లీ అట్టుడికింది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో మహిళల రక్షణపై చర్చకు ఈ సంఘటన దారి తీసింది. మహిళ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి విధించాల్సిన శిక్షలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరు మీద మహిళల కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది.