చంద్రబాబు టార్గెట్: విడిగా జగన్ పార్టీ అవిశ్వాసం
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే తమ వాదనకు మరింత బలం చేకూరుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని తాము మరింత బలంగా చెప్పడానికి అవకాశం లభిస్తుందని అనుకుంటోంది. కాంగ్రెసు ప్రభుత్వానికి పాలించే సత్తా లేదని, అందువల్ల తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కలిసి రావాలని మైసురా రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కాంగ్రెసును రక్షించడానికే చంద్రబాబు కుంటి సాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు వస్తే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, వెనక్కి తీసుకోవాలని ఇతర పార్టీలను కూడా అడుగుదామని, తామంతా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తామని ఆయన అన్నారు. అన్ని పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుదామని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తోకపార్టీలుగా చంద్రబాబు అభివర్ణించడంపై ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు. ఉప ఎన్నికల్లోనే తోక పార్టీ ఎవరిదో తేలియిందని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. భవిష్యత్తులో తోక పార్టీ ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అవిశ్వాసంపై వెనక్కు తగ్గడం ద్వారా కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెలుస్తోందని ఆయన అన్నారు.