వీధుల్లో తొడగొట్టే బాబు, ఎన్టీఆర్కు వెన్నుపోటే: కెటిఆర్
ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా చంద్రబాబు అవిశ్వాసానికి ఎందుకు మద్దతు పలకడం లేదో చెప్పాలన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అప్పట్లో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ ఆదీనంలో నడిచే ప్రభుత్వాన్ని కాపాడుతూ రెండోసారి వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వకుండా చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారన్నారు.
కిరణ్ పాలనలో పాలన పూర్తిగా నాశనమైందన్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రం సాధించింది శూన్యమన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా కిరణ్ నిధులు, రైల్వే ప్రాజెక్టులు సాధించలేక పోయారన్నారు. దీంతో వారి అసమర్థత బయటపడిందన్నారు. రాష్ట్రం నుండి 31 మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.
అవిశ్వాసానికి బాబు ముందుకు రావాలి
అవిశ్వాసానికి చంద్రబాబు ముందుకు రావాలని ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. ప్రభుత్వంపై తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో నిత్యం నిప్పులు చెరుగుతున్న చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదన్నారు. తమ అవిశ్వాసానికి మద్దతివ్వాలి లేదా టిడిపి అవిశ్వాసం పెట్టాలన్నారు. ఆ పార్టీ అవిశ్వాసం పెడితే మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
గవర్నర్ ప్రసంగం నిరాశపర్చింది
తెలంగాణ అంశం లేని గవర్నర్ ప్రసంగం తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశపర్చిందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవన్నారు. ఈ నెల 21న సడక్ బంద్ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలన్నారు. లేదంటే వారిని ప్రజా కోర్టులో నిందితులుగా గుర్తిస్తామన్నారు. సడక్ బందుకు తెరాస, న్యూ డెమోకారసీ పార్టీలు మద్దతిస్తున్నాయని చెప్పారు. బిజెపి మద్దతును కోదండరామ్ కోరారు. కాంగ్రెసుకో ఖతం ఖరో నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు.