కాంగ్రెస్ గంగా నదిలాంటిది, తెలంగాణ తప్పుకాదు: కిరణ్
అవిశ్వాసం ఎదుర్కొంటాం
విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. తమకు స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు అవిశ్వాసం పెడుతున్నా.. పెట్టేందుకు అసలు కారణమే లేదన్నారు. మజ్లిస్ పార్టీ తమకు దూరమైన మైనార్టీ వర్గాలు కాంగ్రెసుతోనే ఉన్నారని చెప్పారు. అవిశ్వాసం పెడితే తాము ఇంకా బలంగా తయారవుతామన్నారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరూ అనుకోవడం లేదన్నారు.
స్థానిక ఎన్నికల కోసమే
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలువలేకనే ఆ పార్టీలు అవిశ్వాస తీర్మానం అంటున్నాయని విమర్శించారు. అదో డ్రామా అన్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులకు సీట్లు వచ్చే అవకాశం లేదని, స్థానిక ఎన్నికల్లో బాగా పని చేస్తేనే సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయే అన్నారు. వచ్చే ఎన్నికలకు ముందు విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశమిస్తామన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు గ్రామాల్లో పునాది లేదన్నారు. అందుకే ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రకు తెరలేపాయన్నారు. బిసిలకు అన్యాయం జరుగవద్దనే ఉద్దేశ్యంతోనే స్థానిక ఎన్నికలు ఇంతకాలం నిర్వహించలేదన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వేటు!
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి నోటీసులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చాలామంది సిట్టింగులకు టిక్కెట్లు వచ్చే అవకాశం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడితే వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎప్పుడు అవసరమని భావిస్తే అప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు.
తెలంగాణ అంటే వ్యతిరేకం కాదు
తెలంగాణ అంశం కూడా పార్టీ సమస్యేనని కిరణ్ చెప్పారు. తెలంగాణపై మాట్లాడితే పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం సాధ్యం కాదన్నారు. కేంద్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు తీర్మానంపై ఆలోచిస్తామని చెప్పారు.