చంద్రబాబుకు జగన్ పార్టీ అల్టిమేటం: అవిశ్వాస నోటీసు
మరోవైపు నోటీసు ఇచ్చిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో టిడిపి అవిశ్వాసం ప్రవేశ పెట్టినప్పుడు తాము మద్దతు పలికామని, అప్పుడు తాము మద్దతిచ్చినప్పుడు ఇప్పుడు తమకు టిడిపి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం తాము మద్దతిస్తామని లేదా వారు పెట్టని పక్షంలో తమకు మద్దతివ్వాలని సూచించారు.
ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై ఎవరైనా నోటీసులు ఇవ్వవచ్చునని అన్నారు. విద్యుత్ కోతలు ప్రభుత్వం చేతకానితనం అని మరో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్నారు. ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కిరణ్ పాలన చంద్రబాబు నాయుడు పాలనను తలపిస్తోందన్నారు.
ప్రభుత్వానికి పాలించే హక్కు ఏమాత్రం లేదని మరో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. టిడిపి పార్టీ తీరు అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా ఉందన్నారు. నిత్యావసర ధరలు పెరిగాయని, విద్యుత్ కోతలు దండిగా ఉన్నాయని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కాంగ్రెసు పార్టీకి పాలించే అర్హత లేదన్నారు.