తీహార్ జైలులో మరో ఆత్మహత్య: ఈసారి మహిళ
అహరణ కేసులో నిందితురాలైన 30 ఏళ్ల మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో జైలు అధికారుల్లో ఆందోళన చోటు చేసుకుంది. సెల్లో ఉరేసుకుని మహిళా ఖైదీ కనిపించింది. వెంటనే ఆమెను జైలు సిబ్బంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
ఆమె ఉంటున్న సెల్లో మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు. అయితే, సంఘటన జరిగిన సమయంలో వారిద్దరు పని మీద బయట ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీ రేష్మా గురువారం సాయంత్రం జైలు నెంబర్ 6లో ఉరేసుకుంది. సహచర ఖైదీలు ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు జైలు అధికారులు చెప్పారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు.
వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం కేసులో రాంసింగ్ సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతన్ని చంపారని రాంసింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాంసింగ్ మరణం జైలులో భద్రతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది.