మూడు రాష్ట్రాలు బోల్తా: బిట్టీకి సాయపడిందెవరు?
మొహంతీ అజ్ఞాత వాసంలో గడిపిన కాలంలో అత్యధికంగా పుట్టపర్తిలోనే మకాం వేశాడని, ఇక్కడి నుంచే రాఘవ రాజన్గా అతను కొత్త అవతారం ఎత్తాడని కేరళ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేరళలోని బ్యాంకులో ఉద్యోగం సంపాదించడానికి కూడా పుట్టపర్తినుంచి పలు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
ఓటరు గుర్తింపు కార్డుతో సహా నివాస ధృవీకరణ పత్రం, ఇతర బ్యాంకు ఉద్యో గానికి అవసరమయ్యే ధృవీకరణ పత్రాలన్నీ కూడా పుట్టపర్తి కేంద్రంగానే బిట్టీ మొహంతి సమర్పించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే కేరళలోని బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడని, చివరకు అసలు రూపం బయటపడగానే పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని తెలు స్తోంది.
బిట్టీ మొహంతి అలియాస్ రాఘవరాజన్ మూడు రాష్ట్రాల పోలీసులను బోల్తా కొట్టించాడు. పుట్టపర్తిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారిపై, విదేశీయులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అయితే ఒక అపరిచిత వ్యక్తి రాఘవరాజన్ పేరుతో పుట్టపర్తిలో ఏళ్ల తరబడి ఉన్నా కనీసం అతని కదలికలను పోలీసులు గుర్తించలేకపోయారా అనేది ప్రశ్నగానే ఉంది.
యేటా ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తుల వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తుంటాయి. బిట్టీ మొహంతి నిఘా వర్గాల కళ్లను కూడా కప్పగలిగాడా అనేది మరో ప్రశ్న. ప్రస్తుతం కేరళ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఎవరెవరు అతడితో కలిసి ఉండేవారు? ఎవరి సహకారంతో పుట్టపర్తిలో మకాం వేశాడు? వివిధ సర్టిఫికెట్లు ఎలా సంపాదించాడు? బ్యాంకు ఖాతాలు ఎప్పుడు తెరిచాడు? అతడి కోసం ఎవరెవరు వచ్చేవారు? ఏయే నెలల్లో అతడిని సంప్రదించారు? వారు బంధువులా? తల్లిదండ్రులా? తదితర పూర్తి వివరాలను కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు. తన తల్లిదండ్రులను బిట్టీ మొహంతి చిన్నమ్మ, చిన్నాన్నలుగా పరిచయం చేశాడని అంటున్నారు.