చిరు నాయక్: జగన్పై కన్నబాబు విసుర్లు, స్పీచ్...
అసలైన నాయకుడు అంటే కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానంటే చిరంజీవి నిలబెడతానని సవాల్ చేసి అనుకున్నది సాధించారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ తుది శ్వాస వరకు కాంగ్రెసుతోనే ఉన్నారన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీ నేతే కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కాదన్నారు. వారు ఆయనను ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు.
వైయస్ పేరుతో మార్కెటింగ్
వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టీకి ఓ ఆయుధం మాత్రమే అన్నారు. ఆ పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. జగన్ పార్టీలో వైయస్ ఫోటో తప్ప అజెండా లేదన్నారు. కాంగ్రెసుకు వైయస్ ఇచ్చిన సర్టిఫికేట్ చాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అంటే యువజన శ్రామిక రైతు పార్టీయే తప్ప వైయస్ పార్టీ కాదన్నారు. జగన్ పార్టీలో చేరాలంటే జైలుకు వెళ్లాలన్నారు. జైలుకు బెయిలుకు మధ్య ఊగిసలాడుతున్న పార్టీ ఆ పార్టీ అన్నారు. అలాంటి పార్టీ అవిశ్వాసం పెడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆ పార్టీని వైయస్సార్ చంచల్గూడ పార్టీ అంటే బావుంటుందన్నారు.
భర్త ఆశయాలకు, కొడుకు అధికార దాహానికి విజయమ్మ ఇరుక్కుపోయారని, ఆమెను చూస్తే కన్న తల్లి గుర్తుకు వస్తుందన్నారు. వైయస్ పదును తగ్గకముందే దానిని ఉపయోగించుకోవాలని వారు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ఆశయ సాధన కోసం పుట్టగా జగన్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం పుట్టిందన్నారు. వైయస్ పేరును ఆ పార్టీ మార్కెటింగ్ చేసుకుంటోందన్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ పార్టీ
అధికార కాంక్షతో పుట్టిన ఆ పార్టీ అధినేత తన తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారని ధ్వజమెత్తారు. జైలు నుండి వచ్చిన సూచనల మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధమైతే దానికి మిగతా పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేదన్నారు. వైయస్ పథకాలు ఎత్తి వేస్తున్నారని జగన్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు.
దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత మొదట అక్కడకు చేరుకున్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే అన్నారు. తర్వాత రోజు చిరంజీవి కూడా వచ్చారన్నారు. సహకార ఎన్నికల ద్వారా రైతులు కాంగ్రెసు వెంటే ఉన్నారనే విషయం అర్థమైందన్నారు. కాంగ్రెసు స్కీముల పార్టీ తప్ప స్కాముల పార్టీ కాదన్నారు.
తెరాసపై మండిపాటు
తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణపై చిత్తశుద్ది లేదన్నారు. వారు తెలంగాణను రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వైయస్ రాజశేఖర రెడ్డియే గతంలో చెప్పారన్నారు. రాష్ట్రంలో నక్సలిజం తగ్గిందన్నారు. తెలంగాణ సున్నితమైన అంశమన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.
చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వక పోవడం వల్లనే కెసిఆర్ పార్టీని పెట్టారన్నారు. పదవి ఇస్తే పార్టీయే పుట్టుకు వచ్చేది కాదన్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. చిరంజీవి రియల్ హీరో అన్నారు.
పార్టీని రెండేళ్లు నడపలేక..
పిఆర్పీలా పార్టీని రెండేళ్లు కూడా నడుపలేక కెసిఆర్ చేతులెత్తేయలేదని హరీష్ రావు అన్నారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా పార్టీని నడిపిస్తున్నామన్నారు. పదవులను గడ్డిపోచల్లా భావించిన పార్టీ తెరాసదే అన్నారు. మంత్రి పదవితో సమానమైన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నప్పుడే తెలంగాణ కోసం కెసిఆర్ బయటకు వచ్చారన్నారు. కన్నబాబు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. కన్నబాబు పిఆర్పీ సభ్యుడిగానే భావించుకొని మాట్లాడుతున్నారేమోనని ఈటెల రాజేందర్ అన్నారు.